మార్చి 23, నేటి తెలుగు పత్రిక: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి దేశవ్యాప్తంగా ఫ్యాన్ పార్కులను ఏర్పాటు చేయనుంది. స్టేడియానికి వెళ్లకుండానే, టికెట్ లేకుండానే మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారంతో స్టేడియం అనుభూతితో ఆస్వాదించే అవకాశం అభిమానులకు కల్పిస్తోంది.మొత్తం 11 రాష్ట్రాల్లోని 15 నగరాల్లో ఈ ఫ్యాన్ పార్కులను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలు మూడు వీకెండ్లలో (శని, ఆదివారాలు) నిర్వహించబడతాయి.
షెడ్యూల్:
- మార్చి 28, 29 – మొదటి వారం
- ఏప్రిల్ 4, 5 – రెండో వారం
- ఏప్రిల్ 11, 12 – మూడో వారం
తెలంగాణలోని నిజామాబాద్ నగరాన్ని కూడా ఈ జాబితాలో చేర్చడం విశేషం. దీంతో స్థానిక క్రికెట్ అభిమానులు భారీ స్క్రీన్లపై మ్యాచ్లను ఉత్సాహంగా వీక్షించే అవకాశం పొందనున్నారు.ఫ్యాన్ పార్కుల్లో కేవలం మ్యాచ్ల లైవ్ స్క్రీనింగ్ మాత్రమే కాకుండా, సంగీత కార్యక్రమాలు, ఫుడ్ కోర్టులు, పిల్లల కోసం ప్లే జోన్లు, వర్చువల్ గేమ్స్, ఫేస్ పెయింటింగ్, 360° ఫోటో బూత్లు వంటి వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయనున్నారు.
