మార్చి 24, నేటి తెలుగు పత్రిక: దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగుతున్న What India Thinks Today 2026 సదస్సులో AIMIM అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశ చమురు కొనుగోళ్లపై అమెరికా ప్రభావం పెరగడం సరైంది కాదని అన్నారు. “మన దేశం చమురు కొనడానికి డొనాల్డ్ ట్రంప్ అనుమతి ఎందుకు తీసుకోవాలి?” అంటూ ప్రశ్నించారు.
ప్రభుత్వ విధానాలపై విమర్శలు
దేశాన్ని రాజ్యాంగం ప్రకారం నడపాలని సూచించిన ఒవైసీ, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఒకే సిద్ధాంతాన్ని రుద్దే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.భారతదేశం అన్ని మతాల ప్రజలది అని స్పష్టం చేస్తూ, ముస్లింలను వేరుగా చూపించే ప్రయత్నాలను ఆయన తప్పుపట్టారు.
అంతర్జాతీయ అంశాలపై వ్యాఖ్యలు
ఇరాన్పై దాడులు, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారత్ విదేశాంగ విధానం బలహీనంగా మారిందని ఒవైసీ అభిప్రాయపడ్డారు. రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికా ప్రభావం ఎందుకు ఉండాలని ప్రశ్నించారు.ప్రస్తుతం దేశం చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, కేవలం కొన్ని రోజుల సరఫరా మాత్రమే మిగిలి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇతర రాజకీయ అంశాలపై స్పందన
సమాజంలో జరుగుతున్న వివాదాస్పద ఘటనలపై కూడా ఒవైసీ స్పందిస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. గంగానది కాలుష్యం, మత రాజకీయాలపై ఆయన విమర్శలు గుప్పించారు.అలాగే, ఇతర రాజకీయ పార్టీలపై కూడా విమర్శలు చేస్తూ, ముఖ్యంగా ప్రాంతీయ రాజకీయ సమీకరణాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
