మార్చి 24, నేటి తెలుగు పత్రిక: టీవీ9 భారతవర్ష్ నిర్వహించిన ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ కార్యక్రమంలో ఇరాన్ ప్రతినిధి అయతుల్లా అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన అభిప్రాయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇరాన్ ఎప్పుడూ యుద్ధాన్ని ప్రారంభించలేదని, అది తమపై బలవంతంగా రుద్దబడిందని ఇలాహీ తెలిపారు. తాము శాంతినే కోరుకుంటున్నామని, అయితే యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికా, ఇజ్రాయెల్లేనని ఆరోపించారు. యుద్ధాన్ని ముగించాల్సిన బాధ్యత కూడా వారిదేనని స్పష్టం చేశారు.అమెరికాపై విశ్వాసం లేదని పేర్కొన్న ఆయన, దాడులు కొనసాగుతున్నంత వరకు యుద్ధం ఆగదన్నారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులు ఆపితేనే ఇరాన్ కూడా వెనక్కి తగ్గుతుందని తెలిపారు. మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనాలంటే ప్రపంచ దేశాలు అమెరికాపై ఒత్తిడి తేవాలని సూచించారు. అలాగే ఇరాన్పై భవిష్యత్తులో దాడులు జరగవని హామీ ఇవ్వాలని, యుద్ధంలో ధ్వంసమైన మౌలిక సదుపాయాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.లెబనాన్, గాజా, సిరియా వంటి ప్రాంతాల్లో కూడా శాంతి నెలకొనాలని కోరుతూ, ఒక స్వతంత్ర దేశంగా ఇరాన్ తన ఆత్మగౌరవం విషయంలో ఎప్పుడూ రాజీ పడదని ఆయన స్పష్టం చేశారు.
