హైదరాబాద్, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరంలో ఎల్పీజీ కొరత హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో హోటళ్లు, రెస్టారెంట్లు భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నాయి.వ్యాపార వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం రెస్టారెంట్లు 40 నుంచి 45 శాతం వరకు నష్టాలు చవిచూస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన నిర్వహణ ఖర్చులకు తోడు గ్యాస్ కొరత పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది.దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత కారణంగా సిలిండర్ల ధరలు రూ.4,000 నుంచి రూ.7,000 వరకు పెరిగాయి. దీంతో గ్యాస్ అందుబాటులో లేక హోటళ్లు ప్రత్యామ్నాయంగా కట్టెలను వినియోగించాల్సి వస్తోంది. అయితే కట్టెల ధరలు కూడా భారీగా పెరిగి కిలోకు రూ.6 నుంచి రూ.11 వరకు చేరాయి.
గ్యాస్తో 30-35 నిమిషాల్లో పూర్తయ్యే వంటలు, కట్టెలతో గంటకు పైగా సమయం తీసుకుంటున్నాయి. దీంతో కస్టమర్లకు సేవలు ఆలస్యమవుతూ, కొందరు వెనుదిరిగే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ ఆలస్యాలు నేరుగా ఆదాయంపై ప్రభావం చూపుతున్నాయి.ఇంధన ఖర్చులు పెరగడంతో కొన్ని హోటళ్లు తమ మెనూలను తగ్గించుకోవాల్సి వచ్చింది. కొన్ని ఐటమ్స్ను పూర్తిగా తొలగించగా, మరికొన్ని అవుట్లెట్లు తాత్కాలికంగా మూసివేసిన పరిస్థితి నెలకొంది. పీక్ అవర్స్లో కూడా సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వ్యాపారులు చెబుతున్నదేమిటంటే, ఈ పరిస్థితి కొనసాగితే చిన్న, మధ్య తరహా హోటళ్లు నిలబడటం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సరఫరా త్వరగా సాధారణ స్థితికి రాకపోతే, నగర హోటల్ రంగం మరింత సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
