అమరావతి, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: ఏపీలో తాగునీటి సమస్యలను పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జల్ జీవన్ మిషన్ 2.0 అమలు కోసం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రం కీలక ఒప్పందం కుదుర్చుకుంది.ఈ ప్రణాళికలో భాగంగా 2028 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ‘హర్ ఘర్ జల్’ లక్ష్యాన్ని సాధించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ ఒప్పంద కార్యక్రమం ఢిల్లీలో నిర్వహించగా, సీఎం చంద్రబాబు వర్చువల్గా పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
నిరంతర తాగునీటి సరఫరా లక్ష్యం
ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఏర్పాటు చేసి, నిరంతర తాగునీటి సరఫరా అందించనున్నారు. ఇప్పటికీ అనేక గ్రామాల్లో నీటి కొరత ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది.
కేంద్రం సహకారం
కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ మాట్లాడుతూ, జల్ జీవన్ మిషన్ 2.0 అమలుకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే కోట్లాది ఇళ్లకు నీటి కనెక్షన్లు అందించామని, మిగతా ఇళ్లకు కూడా త్వరలో అందిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొని, ఈ ఒప్పందాన్ని రాష్ట్రానికి కీలక ముందడుగుగా అభివర్ణించారు.మొత్తంగా, ఈ ప్రణాళిక అమలు అయితే ఏపీలో నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
