మార్చి 25, నేటి తెలుగు పత్రిక: ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ గడువు పెంపుపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) విడుదల చేసిన ప్రకటనలో ఈ వార్తలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది.ప్రత్యేకంగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు 45 రోజులు, ఒక సిలిండర్ ఉన్న వారికి 25 రోజులు, రెండు సిలిండర్లు ఉన్న వారికి 35 రోజుల గ్యాప్ విధించినట్లు ప్రచారం జరుగుతున్నా.. ఇందులో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పింది.ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గడువు కొనసాగుతోందని పేర్కొంది. ఈ గడువు కనెక్షన్ రకాన్ని బట్టి కాకుండా, ప్రాంతాన్ని బట్టి మాత్రమే వర్తిస్తుందని వివరించింది.అదేవిధంగా దేశంలో ఎల్పీజీ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, వాటిని షేర్ చేయవద్దని ప్రజలకు సూచించింది. అవసరం లేకుండా ముందుగానే సిలిండర్లు బుక్ చేసుకోవడం వల్ల సరఫరాపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది.మొత్తంగా, LPG బుకింగ్ గడువుల్లో ఎలాంటి మార్పులు లేవని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది.
