మార్చి 25, నేటి తెలుగు పత్రిక: ప్రస్తుతం నెలకొన్న ఇంధన పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికులకు ఊరటనిచ్చేలా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగర పరిధిలో మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో టికెట్ ధరలపై 30 శాతం రాయితీ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు. పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి క్యూలలో నిలబడే బదులు, సురక్షితంగా బస్సుల్లో ప్రయాణించాలని ఆయన నగరవాసులకు సూచించారు.ఇంధన కొరత పరిస్థితుల్లో ప్రజలు వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి, ప్రజా రవాణాను వినియోగించుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు కాలుష్యం కూడా తగ్గుతుందని చెప్పారు.ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సాధారణంగా ఖరీదుగా భావించే ఏసీ బస్సుల్లో కూడా ఇప్పుడు తక్కువ ధరకే సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వచ్చిందన్నారు. పెట్రోల్ ఇబ్బందుల మధ్య ప్రజలకు ఈ రాయితీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనుంది.
