ఎ.కొండూరు మార్చి 25 (నేటి తెలుగు పత్రిక): వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మండుటెండలు పెరుగుతున్న నేపథ్యంలో రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారులు, ప్రయాణికులు, పాదచారులకు చల్లని మంచినీరు అందించాలనే లక్ష్యంతో చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎ.కొండూరు ఎంపీడీవో బి. శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశాల మేరకు బుధవారం మండలంలోని ఎ.కొండూరు, చీమలపాడు, కంభంపాడు, రామచంద్రాపురం గ్రామాలలో జాతీయ రహదారి వెంబడి చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల సహకారంతో చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేసవి కాలంలో ఎండ తీవ్రత వల్ల ప్రజలు, ప్రయాణికులు దాహంతో ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యగా ఈ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రతిరోజూ చలివేంద్రాల్లో శుద్ధమైన మంచినీరు అందుబాటులో ఉండేలా పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో ఎ.కొండూరు పంచాయతీ కార్యదర్శి సుధాకర్, చీమలపాడు కార్యదర్శి బి. గోపికృష్ణ, కంభంపాడు కార్యదర్శి ఆర్. వెంకటేశ్వరరావు, రామచంద్రాపురం కార్యదర్శి కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
