మార్చి 25, నేటి తెలుగు పత్రిక: దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. దేశంలో ఎలాంటి ఇంధన కొరత లేదని స్పష్టం చేస్తూ ప్రజలు భయపడవద్దని సూచించింది. పెట్రోలియం మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, దేశంలో తగినంత ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయి. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, సుమారు 26 కోట్ల టన్నుల చమురు నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. పెట్రోల్ బంక్ల వద్ద క్యూలు కట్టడం, అవసరం లేకుండా ముందుగానే ఇంధనం నిల్వ చేసుకోవడం వల్ల తాత్కాలికంగా కొరత ఉన్నట్లు కనిపిస్తోందని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించడం కూడా ఇదే కారణమని చెప్పారు.
అటు ఎల్పీజీ సరఫరాలో కూడా ఎలాంటి అంతరాయం లేదని, వాణిజ్య గ్యాస్ కేటాయింపును 50 శాతం పెంచినట్లు వెల్లడించారు. గ్యాస్ బుకింగ్స్లో 92 శాతం పైగా ఆన్లైన్ ద్వారా జరుగుతున్నాయని తెలిపారు.ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ వార్తలతో ప్రజలు ముందుగానే ఫుల్ ట్యాంక్ చేసుకుంటూ బంకుల వద్ద క్యూలు కడుతున్నారు. అయితే ఈ పుకార్లను నమ్మవద్దని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. మొత్తంగా, దేశంలో ఇంధన కొరత లేదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వగా, సోషల్ మీడియాలో వస్తున్న అపోహలే ప్యానిక్కు కారణమవుతున్నాయని తెలిపింది.
