మార్చి 26, నేటి తెలుగు పత్రిక: తెల్లవారుతున్న వేళ… ఇంకా గమ్యం చేరకముందే ప్రాణాలు అగ్నికీలల్లో కలిసిపోయాయి. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం హృదయ విదారక దృశ్యాలను మిగిల్చింది.జగిత్యాల నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వచ్చిన టిప్పర్ను ఢీకొట్టడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఢీకొట్టిన వెంటనే టిప్పర్ డీజిల్ ట్యాంక్ పేలిపోవడంతో మంటలు చెలరేగి క్షణాల్లోనే బస్సును పూర్తిగా ఆవరించాయి.బస్సులో నిద్రలో ఉన్న ప్రయాణికులు బయటపడేలోపే మంటలు వ్యాపించడంతో 13 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉండటం విషాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. మరికొందరు ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో బస్సు అద్దాల మధ్య ఇరుక్కుని మంటల్లో కాలిపోయారు.ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో 26 మందిని ఆస్పత్రికి తరలించగా, మరో 6-7 మందికిపైగా పరిస్థితి విషమంగా ఉంది.క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ విషాద ఘటనపై ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావును పూర్తి వివరాలు సేకరించమని సూచించారు.అలాగే నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి తక్షణ వైద్యం అందించాలని, ప్రమాద కారణాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించారు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు కూడా ఘటనపై స్పందించి, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ ప్రమాదం మరోసారి రోడ్డు భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది.
