ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, ఎమ్మెల్యే నారాయణరెడ్డి, డీజిపి హరీష్ కుమార్ గుప్తా జిల్లా అధికారులు.
మార్చి 26, నేటి తెలుగు పత్రిక: మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆయన వెంటా జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ పి. రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఉన్నారు.ఘటనపై వెంటనే స్పందించిన అధికారులు గోల్డెన్ అవర్లోనే ప్రమాద స్థలానికి చేరుకుని పలువురిని రక్షించినట్లు మంత్రి తెలిపారు.ఈ ప్రమాదంలో మొత్తం 13 మంది మృతి చెందినట్లు, మరో 28 మందిని ఆసుపత్రుల్లో చేర్చినట్లు మంత్రి వెల్లడించారు. బస్సులో మొత్తం 41 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం అందిందని, సీరియస్గా గాయపడిన కొంతమందిని మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించినట్లు చెప్పారు.మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా రాబోయే రోజుల్లో భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేస్తామని మంత్రి తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను నిపుణుల కమిటీ ద్వారా త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.







