మార్కాపురం, మార్చి 26, నేటి తెలుగు పత్రిక: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర మంత్రులు పరామర్శించారు. ఈ ఘటనలో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకుని, వారికి అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి వంగలపూడి అనిత, మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కలిసి బాధితులను పరామర్శించారు.గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు హోంమంత్రి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన అన్ని చికిత్సలు తక్షణమే అందించాలని, ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అలాగే బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని మంత్రులు భరోసా ఇచ్చారు. చికిత్స ఖర్చులు, అవసరమైన సాయం విషయంలో ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు.ఈ ప్రమాదంపై అధికారులు ఇప్పటికే విచారణ ప్రారంభించగా, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. ఇకపై ఇటువంటి ఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
