Breaking News

బిగ్ న్యూస్: అన్ని రాష్ట్రాల సీఎంలతో రేపు ప్రధాని మోదీ కీలక భేటీ

న్యూఢిల్లీ, మార్చి 26, నేటి తెలుగు పత్రిక: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఏర్పడుతున్న ఇంధన సమస్యలు, భద్రతా అంశాలపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రేపు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ పరిణామాల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో అనేక దేశాలు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. భారత్‌పైనా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరాల్లో కొరత ఏర్పడే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది.

రేపు జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ, పశ్చిమాసియా పరిస్థితులపై సమగ్ర సమీక్ష చేయనున్నారు. అలాగే దేశంలో ఇంధన నిల్వలు, సరఫరా వ్యవస్థ, అత్యవసర చర్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రులతో నేరుగా చర్చించనున్నారు. రాష్ట్రాలు తీసుకోవాల్సిన చర్యలపై కూడా మార్గదర్శకాలు ఇవ్వనున్నట్లు సమాచారం.ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో కూడా ప్రధాని మోదీ ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని, దేశ ప్రజలు ఎలాంటి సవాళ్లకైనా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.

ఇంధన కొరత పుకార్లపై కేంద్రం కఠిన చర్యలు

ఇంధన భద్రతపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందని ప్రధాని పేర్కొన్నారు. గల్ఫ్ దేశాలు, అలాగే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ నాయకులతో భారత్ నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తోందని తెలిపారు. సమస్యలను యుద్ధం ద్వారా కాకుండా చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించాలన్నదే భారత్ వైఖరి అని స్పష్టం చేశారు.ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్‌లో అనిశ్చితి నెలకొన్న ఈ సమయంలో, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థపై కీలక ప్రభావం చూపనున్నాయి. దీంతో రేపటి సీఎంల సమావేశంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

ఖార్గ్ దీవిపై టెన్షన్.. అరబ్ దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *