విశాఖపట్నం, మార్చి 26, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా గ్యాస్, చమురు కొరత ఆందోళనలు నెలకొన్న వేళ ఆంధ్రప్రదేశ్కు ఉపశమనం లభించింది. విశాఖ తీరానికి భారీ ఎల్పీజీ, చమురు నౌకలు చేరుకోవడంతో సరఫరా పరిస్థితులు మెరుగుపడనున్నాయి. విశాఖపట్నం పోర్ట్కు భారీ ఎల్పీజీ నౌక “బిర్చ్” హార్బర్ మౌత్ వద్ద లంగరేసింది. ఈ నౌకలో పెద్ద ఎత్తున ఎల్పీజీ నిల్వలు ఉండటంతో రాష్ట్రానికి గ్యాస్ సరఫరాలో కొంత ఊరట లభించనుంది.ఇక మరోవైపు, ఇప్పటికే MT “పెట్రాయిట్” అనే చమురు ట్యాంకర్ కూడా విశాఖ పోర్టుకు చేరుకుంది. ఈ నౌక ద్వారా భారీగా చమురు నిల్వలు దిగుమతి అవుతున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ సరఫరా వ్యవస్థ మరింత బలపడనుంది.
ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో గ్యాస్, చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ నౌకల రాక ఎంతో కీలకంగా మారింది. ముఖ్యంగా పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభానికి ఇది కొంతవరకు పరిష్కారంగా మారనుంది.భారీ నిల్వలతో నౌకలు చేరుకోవడంతో సంబంధిత అధికారులు, ఆయిల్ కంపెనీలు, పోర్ట్ యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నాయి. సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు వేగవంతం చేశారు.ఇక రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సరఫరాలను కొనసాగించేందుకు కేంద్రం, ఆయిల్ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ప్రజలకు ఇంధన కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
