హైదరాబాద్, మార్చి 26, నేటి తెలుగు పత్రిక: నగరంలోని కోర్ అర్బన్ ప్రాంతాల్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ (MMTS) సేవలను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కార్యాలయ సమయాల్లో రైళ్ల సంఖ్యను పెంచడంతో పాటు సమయపాలన కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.శాసన మండలి హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం ఎంఎంటీఎస్ సేవలపై విస్తృతంగా చర్చించారు. ఇటీవల ఎంఎంటీఎస్లో ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టడంపై ఆరా తీశారు. ఈ తగ్గుదలకు గల కారణాలను విశ్లేషించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రధానంగా ఎంఎంటీఎస్ స్టేషన్లకు చేరుకునే సౌకర్యాల లోపాన్ని సీఎం గుర్తించారు. అనేక స్టేషన్ల వద్ద ఆర్టీసీ బస్సులు వెళ్లలేని పరిస్థితి ఉండటం, స్టేషన్లు లోపలికి ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో లాస్ట్ మైల్ కనెక్టివిటీ మెరుగుపరచడానికి మినీ బస్సులను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.అలాగే ఎంఎంటీఎస్ స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. మెరుగైన వసతులు ఉన్నప్పుడే ప్రజలు ఈ సేవలను వినియోగిస్తారని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ ఆదాయ వనరులను పెంచుకునే దిశగా కూడా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ప్రయాణికుల సంఖ్య పెంపు, సదుపాయాల మెరుగుదల, లాస్ట్ మైల్ కనెక్టివిటీ వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు.ఈ సమీక్ష సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావుతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు పాల్గొన్నారు.
