మార్చి 27, నేటి తెలుగు పత్రిక: అయోధ్యలోని రామ మందిరం, అయోధ్యలో రామ నవమి సందర్భంగా అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. రామ్ లల్లాకు సూర్య తిలకం దిద్దిన వేళ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు.మార్చి 27న మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు, శాస్త్రీయ పద్ధతిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ ద్వారా సూర్యకిరణాలు గర్భగుడిలోకి ప్రవేశించి రామ్ లల్లా నుదుటిపై తిలకంగా ప్రకాశించాయి. అద్దాలు, లెన్స్లు, గొట్టాల సమన్వయంతో ఈ ప్రక్రియ నిర్వహించబడింది. సుమారు 75 మిల్లీమీటర్ల వృత్తాకార తిలకం కొన్ని నిమిషాల పాటు కనిపించి భక్తులను మంత్రముగ్ధులను చేసింది.ఈ అరుదైన దృశ్యం సంప్రదాయం మరియు ఆధునిక సాంకేతికతల సమ్మేళనంగా నిలిచింది. ఆలయ ప్రాంగణం “జై శ్రీ రామ్” నినాదాలతో మారుమోగింది. వేలాది మంది భక్తులు ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించగా, మరెంతో మంది దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన లైవ్ ప్రసారాల ద్వారా దర్శనం పొందారు.ఇక న్యూఢిల్లీలోని తన నివాసంలో నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధాని నరేంద్ర మోదీ సూర్య తిలకం వేడుకను అభినందించారు.రామ నవమి సందర్భంగా జరిగిన ఈ విశేష ఘట్టం భక్తి, శాస్త్ర విజ్ఞానానికి ప్రతీకగా నిలిచింది.
