శ్రీ రాముడు చూపిన మార్గంలో ఆదర్శ పాలన అందిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు
యువ నాయకుడు నారా లోకేష్ మంగళగిరి శాసనసభ్యుడు కావడం నియోజకవర్గ ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం
మంగళగిరి నియోజకవర్గం ఈ రెండేళ్లలో సాగిస్తున్న ప్రగతి ప్రయాణం స్ఫూర్తిదాయకం
మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు
యర్రబాలెం వాల్మీకి మహర్షి ఆలయ సందర్శన
మంగళగిరి, మార్చి 27, నేటి తెలుగు పత్రిక: పరిపూర్ణ మానవత్వానికి ప్రతిరూపం శ్రీరాముడు అని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీరాముడు మార్గంలో ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తున్నారని మాజీమంత్రి, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కొనియాడారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా మంగళగిరి – తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెం పారిశ్రామిక వాడలోని వాల్మీకి మహర్షి ఆలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వాల్మీకి మహర్షిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ… యువ నాయకులు నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గ పరిధి యర్రబాలెం లోని వాల్మీకి మహర్షి ఆలయాన్ని సందర్శించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. చిన్నచిన్న కూలీ పనులు చేసుకుని పేదరికంలో ఉన్న వాల్మీకి బోయ బంధువులందరూ కలిసి ఐకమత్యంతో ఈ ఆలయాన్ని నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. శ్రీరాముడు జీవనాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత ప్రమాణాలతో జీవించాలనుకునే కోట్లాదిమందికి శ్రీరామనవమి పండుగ రోజు అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. మహానుభావుడు శ్రీరాముడు మనందరికీ మార్గదర్శి అని, పరిపూర్ణమైన మానవత్వానికి ఆయన ప్రతిరూపమన్నారు. ధర్మానికి సత్యనిష్టకు, పరిపాలనకు, దాంపత్య జీవనానికి శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సతీ పతుల జీవనంలో గానీ, అన్నదమ్ముల బాంధవ్యంలో గానీ, తండ్రి కొడుకుల వాత్సల్యంలో గానీ రామాయణం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అటువంటి అద్భుతమైన రామాయణం రచయిత మహర్షి వాల్మీకి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. రామాయణాన్ని రచించిన వాల్మీకి తమ ఆది పురుషుడని చెప్పుకునే జాతి తమదన్నారు. రాష్ట్రంలోని లక్షలాదిమంది వాల్మీకి బోయలు వాల్మీకి మహర్షిని దైవంగా భావిస్తూ జీవనం గడుపుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాముడు చూపిన మార్గంలో రాష్ట్రంలో ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. అన్ని వర్గాల సంక్షేమం, అలాగే అన్ని ప్రాంతాల అభివృద్ధి చేపడుతూ సీఎం చంద్రబాబు ఆదర్శంగా పరిపాలన చేస్తున్నారన్నారు. యువ నాయకుడు నారా లోకేష్ మంగళగిరి శాసనసభ్యుడు కావడం నియోజకవర్గ ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతమే కాకుండా అదృష్టం కూడా అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఈ రెండేళ్లలో సాగిస్తున్న ప్రగతి ప్రయాణం స్ఫూర్తిదాయకమైనదని, అందరికీ ఆదర్శనీయమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ ఆనంద స్వామీజీ, వాల్మీకి బోయ సంఘ ప్రతినిధులు నల్ల బోతుల లక్ష్మణ, కామినేని సాంబశివరావు, నల్లబో తుల సుబ్బారావు, చొప్పవరపు గోపి, బోడ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.
