మార్చి 31, నేటి తెలుగు పత్రిక: దేశంలో హైస్పీడ్ రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలకంగా ముందుకెళ్తోంది. బడ్జెట్లో ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ కారిడార్ల అమలుపై తాజాగా పురోగతి వివరాలు వెల్లడయ్యాయి. ఈ ప్రాజెక్టుల అమలుకు బాధ్యతలను జాతీయ హై స్పీడ్ రైలు సంస్థ లిమిటెడ్ కు అప్పగించడంతో పనులు వేగం పుంజుకున్నాయి.ఈ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన పార్లమెంటరీ కమిటీ, భూసేకరణ మరియు అనుమతుల ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే శాఖకు సూచించింది. గతంలో ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు కారిడార్ లో జరిగిన ఆలస్యాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. దేశవ్యాప్తంగా ముంబై–పుణె, పుణె–హైదరాబాద్, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై, చెన్నై–బెంగళూరు, ఢిల్లీ–వారణాసి, వారణాసి–సిలిగురి వంటి మార్గాల్లో హైస్పీడ్ కారిడార్లు ప్రతిపాదించారు. వీటి కోసం రూపొందించిన ప్రాజెక్టు నివేదికల్లో మార్పులు చేస్తున్నారు.
బుల్లెట్ ట్రైన్ సేవలు ప్రారంభమైతే గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం సాధ్యమవుతుంది. దీంతో నగరాల మధ్య దూరాలు తగ్గి, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.ఈ ప్రాజెక్టుల ద్వారా దేశంలో పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాలకు మెరుగైన కనెక్టివిటీ లభించనుంది.
