మార్చి 31, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో కురిసిన అకాల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ముఖ్యంగా జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల్లో చేతికొచ్చే దశలో ఉన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.వందలాది ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న పంటలు నేలకూలిపోయాయని, మామిడి కాయలు రాలిపోవడంతో రైతులకు అపార నష్టం వాటిల్లిందన్నారు. నువ్వులు, పసుపు, వరి పంటలకు కూడా తీరని నష్టం జరిగిందని పేర్కొన్నారు.సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున వరకు కురిసిన అకాల వర్షాలతో రైతుల కష్టం నేలపాలైందని తెలిపారు. పంటలు నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
