హైదరాబాద్, మార్చి 31, నేటి తెలుగు పత్రిక: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. పార్లమెంట్లో కేంద్ర మంత్రి చేసిన ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని, అవి రాష్ట్ర ప్రభుత్వ భాషను తలపిస్తున్నాయని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు.కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న “ఫెవికాల్ బంధం” బయటపడిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయలు దుర్వినియోగమయ్యాయని పార్లమెంట్ సాక్షిగా ఎలా వ్యాఖ్యానిస్తారని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమేనని గుర్తుచేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికి ఆదర్శమని పలువురు కేంద్ర మంత్రులు, నిపుణులు ప్రశంసించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. సాగు విస్తీర్ణం పెరగడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించిందని తెలిపారు.అసెంబ్లీ నిర్వహణపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా సభను తూతూ మంత్రంగా నడిపారని, గ్యారెంటీల అమలుపై స్పష్టత లేదన్నారు. ప్రతిపక్షాల గొంతును నొక్కివేస్తున్నారని ఆరోపించారు.కాళేశ్వరం నీటితో సాగు జరుగుతున్న ప్రాంతాలను చూపించేందుకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు రావాలని సవాల్ విసిరారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీయకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
