హైదరాబాద్, మార్చి 31, నేటి తెలుగు పత్రిక: మూసి పునర్జీవన పనులు పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగుతాయని డిప్యూటీ సీఎం, మూసి క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.సచివాలయంలో సబ్ కమిటీ సభ్యుడు పొన్నం ప్రభాకర్తో కలిసి జరిగిన సమావేశంలో ప్రగతిని సమీక్షించారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 15 వరకు ప్రజల అభిప్రాయాలను ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తామని వెల్లడించారు. వచ్చిన సూచనలను పరిశీలించి, అవసరమైతే ప్రజలతో ప్రత్యక్షంగా చర్చలు జరుపుతామని చెప్పారు. మూసీ నది ఒడ్డున ఓంకారేశ్వర ఆలయం పనులకు ఇప్పటికే శంకుస్థాపన జరిగినట్లు తెలిపారు. ఫేజ్-1, ఫేజ్-2 పనులకు స్పష్టమైన రోడ్మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.పునరావాసం, డిజైన్లు, ఫైనాన్స్ తదితర అంశాల్లో సమన్వయం చేసుకుని వేగంగా పనులు ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి సంకల్పాన్ని అధికారులు అర్థం చేసుకుని పనిచేయాలని పేర్కొన్నారు.మూసి ప్రాజెక్టు అధికారులు జీవితాల్లో మైలురాయిగా నిలుస్తుందని, అవసరమైన సహాయం కోసం సబ్ కమిటీ సభ్యులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.
