ఆదిలాబాద్, మార్చి 31, నేటి తెలుగు పత్రిక: కష్టపడి పండించిన పంటను కళ్లముందే కోల్పోయిన రైతు విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. గుడిహత్నూర్ మండలం ముత్నూరు తండాలో గుర్తు తెలియని వ్యక్తులు శనగ పంట కుప్పకు నిప్పు పెట్టారు. ముత్నూరు తండాకు చెందిన రైతు రాం ప్రకాష్ తన పొలంలో పండించిన శనగ పంటను కోత కోసి విక్రయానికి సిద్ధం చేసి కుప్పగా వేసి ఉంచాడు. అకాల వర్షాల భయంతో రాత్రి పొలంలోనే కాపలా కాస్తుండగా అర్ధరాత్రి సమయంలో ఈ దారుణం జరిగింది.మంటల వేడి తగలడంతో మేల్కొన్న రైతు సహాయం కోసం కేకలు వేయగా, సమీప రైతులు వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే మంటలు విస్తరించి పంట మొత్తం దహనమైంది.ఈ ఘటనలో సుమారు 50 క్వింటాళ్ల శనగ పంట కాలిపోవడంతో దాదాపు రూ.3 లక్షల నష్టం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది.దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత రైతుకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
