ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: కేరళలోని ఎట్టుమానూరు నియోజకవర్గం నుంచి 26 ఏళ్ల యువతి అష్నా తంపి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) తరఫున పోటీ చేస్తున్న ఆమె, తన అఫిడవిట్లో కేవలం రూ.84 మాత్రమే ఆస్తిగా పేర్కొనడం విశేషం. అందులో చేతిలో రూ.40 నగదు, బ్యాంక్ ఖాతాలో రూ.44 మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. ఆమె పేరుపై ఎటువంటి ఇల్లు, భూమి లేదా వాహనం లేదు.అధిక ఖర్చులతో సాగుతున్న ఎన్నికల నేపథ్యంలో, ఆమె నిరాడంబర జీవనం మరియు ఆస్తి వివరాలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసాయి. విద్యావంతురాలైన ఆమె, సామాజిక సమస్యలపై చురుకుగా పనిచేస్తూ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది.భారీ ఖర్చులు లేకుండా ప్రజల విరాళాలతోనే ప్రచారం నిర్వహించడం ఆమె ప్రత్యేకతగా మారింది. స్థానిక ప్రజలు ఇచ్చే చిన్నచిన్న విరాళాలతో పోస్టర్లు, ప్రచార సామగ్రి సిద్ధం చేసుకుంటూ ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తోంది.వైద్య సదుపాయాల లోపం, రైతుల సమస్యలు, తాగునీటి సమస్యల వంటి స్థానిక అంశాలపై దృష్టి సారిస్తూ ప్రచారం కొనసాగిస్తున్న ఆమె, ప్రజా సమస్యలే తన అసలు బలం అని చెబుతోంది.
