ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని బాధ్యతగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు పెద్ద ఊరటనిచ్చింది. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తూ నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపింది.ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 93 వేల చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, 11,488 మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తోంది. దీని వల్ల మగ్గం ఆధారంగా జీవిస్తున్న వేలాది కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గనుంది.ప్రభుత్వం ఈ పథకంపై ఏడాదికి సుమారు రూ.150 కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే నేతన్నల సంక్షేమమే ముఖ్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి రూ.8 వేల నుంచి రూ.21 వేల వరకు ఆదా కలగనుంది.అదే సమయంలో చేనేత ఉత్పత్తులకు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. బ్రాండింగ్, మార్కెటింగ్ సదుపాయాల ద్వారా అమ్మకాలను పెంచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.మగ్గం దగ్గర కూర్చుని జీవనాన్ని కొనసాగిస్తున్న ప్రతి నేతన్నకు ఈ పథకం ఆర్థిక భరోసా మాత్రమే కాకుండా వారి వృత్తికి గౌరవం కూడా అందిస్తోంది. చేనేత కుటుంబాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం అండగా నిలుస్తుందని వెల్లడించింది.




