ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: అమరావతి చట్టబద్ధత బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. లోక్సభలో జరిగిన చర్చను తాను టీవీలో పూర్తిగా వీక్షించానని, ఆ చర్చ ఉత్కంఠ రేపిందని పేర్కొన్నారు.సభలో సభ్యులు అమరావతి చరిత్ర, సంస్కృతి, అవసరాన్ని వివరిస్తున్నప్పుడు ఒక ఆంధ్రుడిగా గర్వంగా అనిపించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహా దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమని అన్నారు.లోక్సభ వేదికగా అమరావతి గొప్పతనం దేశమంతటికీ మరోసారి పరిచయమైందని లోకేష్ వ్యాఖ్యానించారు. అయితే ఈ కీలక చర్చలో పాల్గొనకుండా వైసీపీ సభ్యులు వాకౌట్ చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు.ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని, అమరావతి శాశ్వత రాజధానిగా నిలుస్తుందని స్పష్టం చేశారు. “నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ శాశ్వతం.. నా రాజధాని అమరావతి అజరామరం” అని ఆయన పేర్కొన్నారు.








