ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా చట్టబద్ధం చేసే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడం చారిత్రాత్మక ఘట్టమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. “నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ – నా రాజధాని అమరావతి” అనే నినాదంతో ఐదుకోట్ల ఆంధ్రులు గర్వంగా నిలిచే రోజుకు పార్లమెంట్ వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు.ఒకే రాష్ట్రం–ఒకే రాజధాని భావనతో అమరావతిని రాజధానిగా నిర్ణయించిన ఏపీ అసెంబ్లీ తీర్మానానికి చట్టబద్ధత కల్పించడం ప్రజల ఆకాంక్షలకు న్యాయం చేసినట్టేనని చెప్పారు. ఈ బిల్లుకు మద్దతు తెలిపిన కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర రాజకీయ పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఇది కేవలం ఒక బిల్లుకు ఆమోదం మాత్రమే కాకుండా, కోట్లాది ఆంధ్రుల ఆశయాలకు లభించిన విజయం అని లోకేష్ వ్యాఖ్యానించారు. అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలకు ఇది సరైన గౌరవమని, శాంతియుత పోరాటానికి దక్కిన ఫలితమని పేర్కొన్నారు.అమరావతి చరిత్ర, సంస్కృతికి ప్రతీకగా నిలుస్తూ ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధానిగా కొనసాగుతుందని లోకేష్ స్పష్టం చేశారు. “జై ఆంధ్రప్రదేశ్.. జయహో అమరావతి” అంటూ ఆయన తన స్పందనను ముగించారు.
