విజయవాడ, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: విజయవాడలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆరోగ్యశ్రీ పథకానికి సరైన నిధులు కేటాయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.ప్రజల ఆరోగ్యానికి రూపాయి కూడా ఇవ్వకుండా, ఇతర కార్యక్రమాలకు భారీగా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.3 వేల కోట్లు పెండింగ్లో ఉన్నప్పటికీ వాటిని విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని అన్నారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కోట్లాది పేదలకు ప్రాణాధారమని, అలాంటి పథకాన్ని ప్రస్తుతం నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. నెలల తరబడి వైద్యసేవలు నిలిచిపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.అలాగే ఆరోగ్యశ్రీని ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చలు జరిపి సేవలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహించడం మానుకుని తక్షణం బకాయిలు విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిలా హెచ్చరించారు.
