విజయవాడ, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశాలపై కాంగ్రెస్ పార్టీ గళం వినిపించిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్లో ఈ విషయాలను ప్రస్తావించిన కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్కు రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.విభజన హామీల అమలుపై కాంగ్రెస్ నాయకత్వం చూపుతున్న చిత్తశుద్ధి, రాష్ట్ర ఎంపీల్లో కనిపించకపోవడం దురదృష్టకరమని షర్మిల విమర్శించారు. ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్రానికి చెందిన ఒక్క ఎంపీ కూడా బలంగా మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే కేంద్రానికి మెప్పు పొందడమే ముఖ్యమైందని ఆరోపిస్తూ, అన్ని పార్టీల ఎంపీలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల హక్కుల కోసం పోరాడాల్సిన ఎంపీలు మౌనంగా ఉండటం రాష్ట్రానికి నష్టం కలిగిస్తోందన్నారు. విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఇప్పటికైనా ఎంపీలు కేంద్రాన్ని నిలదీయాలని షర్మిల కోరారు. లేదంటే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
