అప్పుడే ప్రమాదాలకు అడ్డుకట్ట!
మంగళగిరి మండల ప్రయాణికుల సంక్షేమ సంఘం కార్యదర్శి నన్నపనేని నాగేశ్వరరావు
మంగళగిరి ఏప్రిల్ 01 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరి అధికారుల అనాలోచిత చర్యల వలన మంగళగిరి మండలం చినకాకాని వద్ద పడమర బైపాస్ పై రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని మంగళగిరి మండల ప్రయాణికుల సంక్షేమ సంఘం కార్యదర్శి నన్నపనేని నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మాట్లాడుతూ, గత 15 ఏళ్ల క్రితం పడమర బైపాస్ నిర్మాణం ప్రారంభమైన సమయంలో ఇక్కడ ఫ్లై ఓవర్ నిర్మిస్తేనే ప్రమాదాలను అరికట్టేందుకు వీలుంటుందని తాను సూచించినట్లు చెప్పారు. నిర్మాణం పూర్తయ్యాక చూద్దాంలే అని ఆరోజు చెప్పారని తెలిపారు. బైపాస్ నిర్మాణం పూర్తయ్యాక చినకాకాని వద్ద పడమర బైపాస్, తూర్పు బైపాస్ అనుసంధానం అయ్యే ప్రాంతంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, దీని వలన ప్రజలు తమ ప్రాణాలు కోల్పోతున్నారని, అనేక మంది తీవ్రంగా గాయాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవరపల్లి నుంచి కొవ్వూరు చేరుకునే హైవేపై ఉన్న తరహాలో ఫ్లై ఓవర్ నిర్మించాలని సూచించారు. లేదంటే ప్రమాదాలు ఆగే పరిస్థితి ఉండదని తెలిపారు. ఫ్లై ఓవర్ నిర్మాణం దిశగా చర్యలు తీసుకుని ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన కోరారు.
