హైదరాబాద్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమం ప్రజల సమస్యల పరిష్కారానికి కీలకంగా మారుతుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామ సభల ద్వారా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ల మధ్య కూడా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో రాజీ పడకుండా ముందుకు సాగుతున్నామని సీఎం స్పష్టం చేశారు. ప్రజల అవసరాలే ప్రభుత్వ నిర్ణయాలకు ఆధారమని పేర్కొన్నారు.మహాలక్ష్మి, ఉచిత బస్సు ప్రయాణం, తక్కువ ధర గ్యాస్, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అర్హులందరికీ చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి అధికారి బాధ్యతతో పని చేసి గ్రామ స్థాయి సమస్యలను వేగంగా పరిష్కరించాలని సూచించారు.“తెలంగాణ రైజింగ్ 2047” లక్ష్యంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపే దిశగా సమిష్టిగా కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. 99 రోజుల కార్యాచరణను ఒక ఉద్యమంగా తీసుకుని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.
