ఒంటిమిట్ట, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: సతీసమేతంగా ఒంటిమిట్ట పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి శ్రీ సీతారాముల వారిని దర్శించుకున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు.వేలాది భక్తులతో కలిసి జరిగిన కళ్యాణోత్సవాన్ని తిలకించిన సీఎం, రాష్ట్ర ప్రజలందరిపై సీతారాముల ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. భక్తులకు కల్పించిన సదుపాయాలు, దర్శన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు.ఒంటిమిట్ట క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా టెంపుల్ టూరిజం కేంద్రంగా మరింత అభివృద్ధి చేసేందుకు దేవుడి ఆశీస్సులు కోరుకున్నట్లు సీఎం తెలిపారు. కోదండ రామస్వామివారి కళ్యాణ మహోత్సవంలో ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్తో కలిసి ఆలయానికి విచ్చేసిన ఆయన, ఏపీ ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, సీతారాముల కళ్యాణం కేవలం భక్తి కార్యక్రమమే కాకుండా మన సంస్కృతి, వివాహ బంధంలోని పవిత్రతకు ప్రతీక అని పేర్కొన్నారు. భక్తులతో కలిసి కళ్యాణోత్సవాన్ని తిలకించడం ఆనందంగా ఉందన్నారు.రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ సీతారాముల ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు.









