ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా వాహనదారులకు మరో షాక్ తగిలింది. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.హైఎండ్ వాహనాల్లో వినియోగించే ఎక్స్పీ100 పెట్రోల్ ధరను లీటరుకు సుమారు రూ.11 పెంచగా, ఇప్పుడు అది రూ.160కు చేరింది. అలాగే ‘ఎక్స్ట్రా గ్రీన్’ ప్రీమియం డీజిల్ ధరను రూ.91.49 నుంచి రూ.92.99కు పెంచారు.అయితే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించినప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు.ఇక కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర కూడా భారీగా పెరిగింది. ఢిల్లీలో 19 కేజీల సిలిండర్ ధర రూ.2,078.50కి చేరింది. అదేవిధంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు రికార్డు స్థాయికి చేరడంతో విమాన టికెట్ ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
