న్యూఢిల్లీ, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలకు ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. పలు కీలక రసాయనాలు, ఎరువుల ముడి పదార్థాలపై దిగుమతి సుంకాలను తాత్కాలికంగా రద్దు చేసింది.అమ్మోనియం నైట్రేట్తో పాటు మెథనాల్, ఫినాల్, పీవీసీ, పాలీప్రొపిలీన్ వంటి దాదాపు 40 రకాల పెట్రోకెమికల్ ఉత్పత్తులపై సుంకాలను సున్నాకు తగ్గించారు. ఈ మినహాయింపు ఏప్రిల్ 2 నుంచి జూన్ 30 వరకు అమల్లో ఉంటుంది.పెరిగిన ముడి పదార్థాల ధరలు, సరఫరా కొరత కారణంగా పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఎరువుల రంగానికి ఇది పెద్ద ఊరటనివ్వనుందని భావిస్తున్నారు.ఈ చర్యతో పరిశ్రమలకు తక్కువ ధరల్లో ముడి పదార్థాలు అందుబాటులోకి రావడంతో పాటు, ఉత్పత్తి ఖర్చులు తగ్గి ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వచ్చే అవకాశముంది. అలాగే ప్యాకేజింగ్, ఆటోమోటివ్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగాలపై కూడా సానుకూల ప్రభావం పడనుంది.
