హైదరాబాద్/వరంగల్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: కూకట్పల్లిలో చోటుచేసుకున్న తల్లి-పిల్లల ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, వరంగల్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. భర్త వేధింపులు భరించలేక స్రవంతి తన ఇద్దరు పిల్లలను హతమార్చి ఆత్మహత్య చేసుకున్న ఘటనతో బంధువులు ఆగ్రహావేశాలకు గురయ్యారు.మృతదేహాలను స్వగ్రామమైన బోడమాణిక్యతండాకు తీసుకురాగానే ఉద్రిక్తత నెలకొంది. భర్త ప్రవీణ్ ఇంటి ముందు పిల్లల మృతదేహాలను ఖననం చేయాలని కుటుంబ సభ్యులు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.ఈ క్రమంలో ఆగ్రహించిన బంధువులు పోలీసుల కళ్లలో కారం చల్లి ఉద్రిక్త పరిస్థితిని సృష్టించారు. గందరగోళం మధ్య పిల్లల మృతదేహాలను ప్రవీణ్ ఇంటి ముందే ఖననం చేయగా, స్రవంతి మృతదేహాన్ని సమీపంలోని పొలంలో దహనం చేశారు.ఇదే సమయంలో భర్త ఇంటికి నిప్పంటించడం, గ్రామంలో ఆందోళనలు కొనసాగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గ్రామంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
