హైదరాబాద్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభలో బిల్లు ఆమోదం పొందడం సంతోషకరమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.అదే సమయంలో తెలంగాణకు ఇచ్చిన విభజన హామీల అమలులో కేంద్రం వైఫల్యం చెందిందని విమర్శించారు. పునర్విభజన చట్టంలో ఉన్న కీలక అంశాలు ఇప్పటికీ అమలు కాకపోవడం ఆందోళనకరమన్నారు.బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా వంటి హామీలు నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఇవి రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకమని అన్నారు.ఒక రాష్ట్రానికి వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ, మరో రాష్ట్రాన్ని విస్మరించడం సరైన విధానం కాదని కేంద్రంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణకు న్యాయం చేయాలంటే అన్ని హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
