అమరావతి, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధం చేసే బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందడం పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ ఆనందకరమైన పరిణామమని అన్నారు.ఇకపై అమరావతి రాజధానిగా అజేయంగా నిలుస్తుందని స్పష్టం చేసిన ఆయన, ఈ బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.రాజధాని విషయంలో అపోహలు సృష్టించే వ్యాఖ్యలను ప్రజలు పట్టించుకోవద్దని సూచిస్తూ, అమరావతిలో అభివృద్ధి పనులు ఇప్పటికే వేగం పుంజుకున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు.అలాగే, బిల్లుకు మద్దతు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా సంబరాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఇళ్ల ముందు దీపాలు వెలిగించాలని, పార్టీ శ్రేణులు కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
