అమరావతి, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2026 పార్లమెంట్ ఉభయ సభల్లో ఏకగ్రీవంగా ఆమోదం పొందడాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రజల సమిష్టి సంకల్పం జాతీయ స్థాయిలో ప్రతిధ్వనించిందని పేర్కొన్నారు.రాష్ట్ర ఆకాంక్షలకు అండగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2015లో అమరావతి శంకుస్థాపన నుంచి 2025లో అభివృద్ధి పునరుద్ధరణ వరకు ప్రతి దశలో కేంద్రం సహకారం అందించిందని గుర్తుచేశారు. అలాగే, ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అమరావతిని ఏకైక రాజధానిగా మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలు, పార్లమెంట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేక ఆంధ్రప్రదేశ్ ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నదని, అలాంటి సమయంలో అమరావతి రైతుల త్యాగం ఈ కలను నిలబెట్టిందని పేర్కొన్నారు.ఈ నిర్ణయం రాష్ట్రానికి స్థిరత్వాన్ని తీసుకువచ్చే కీలక మలుపు అవుతుందని, ప్రతి పౌరుడికి నూతన ఆత్మవిశ్వాసం, అభివృద్ధికి నాంది పలుకుతుందని తెలిపారు. ఇకపై అమరావతి రాజధాని హోదాపై ఎలాంటి సందేహాలు లేవని స్పష్టం చేశారు.
