అమరావతి, మే 04, (నేటి తెలుగు పత్రిక): ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్న తరుణంలో ప్రజలు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల ధోరణి పరిశీలిస్తే ఎన్డీఏ అభ్యర్థుల ప్రదర్శన స్పష్టంగా కనిపిస్తోందని, ప్రజల్లో మోదీపై విశ్వాసం తగ్గకుండా మరింతగా పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. దేశ అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు తమ ఓటు ద్వారా మద్దతు ఇస్తున్నారని చెప్పారు.‘వికసిత భారత్’ లక్ష్యానికి ప్రజలు మద్దతు తెలుపుతున్నారని, 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సంకల్పానికి ఇది బలమని చంద్రబాబు నాయుడు తెలిపారు. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ నినాదం క్షేత్రస్థాయిలో అమలవుతూ అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుత ఫలితాలు మోదీ నాయకత్వంపై పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని, ఎన్డీఏ కూటమి మరింత బలపడుతుందని చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
