యువ కళాకారుడి మృతి.. సినీ వర్గాల్లో విషాదం
నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాజమండ్రిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు పొందిన యువ నటుడు లక్ష్మీ నారాయణ (28) అలియాస్ బాబీ మృతి చెందారు. రాజమండ్రి రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.ప్రమాద సమయంలో బాబీ హెల్మెట్ ధరించకపోవడంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో బాబీతో పాటు మరో ఇద్దరు యువకులు కూడా మృతి చెందారు. అయితే హెల్మెట్ ధరించిన ఓ యువకుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.రాజమహేంద్రవరం చెందిన బాబీ, మాజీ ఎంపీ హర్ష కుమార్ వద్ద డ్రైవర్గా పని చేశారు. అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి కార్యక్రమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.బాబీ అకాల మరణం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జబర్దస్త్ కళాకారులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

