విద్యార్థి నేతల ఆరోపణలు – యూనివర్సిటీ కౌంటర్ ఫిర్యాదు
నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తిరుపతి జిల్లా తిరుచానూరులో జరిగిన విద్యార్థి నేతల కిడ్నాప్ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి మోహన్బాబు, మంచు విష్ణు, యూనివర్సిటీ పీఆర్వో సతీష్లపై తిరుచానూరు పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు.
మోహన్బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ, అక్రమాలపై ప్రశ్నిస్తూ SFI నేతలు కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమవుతున్న సమయంలో, విద్యార్థి సంఘం నేతలు అక్బర్, వినోద్లను యూనివర్సిటీ బౌన్సర్లు బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనను కిడ్నాప్గా భావించి CPM నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు కిడ్నాపర్ల వాహనాన్ని చేజింగ్ చేసి మోహన్బాబు యూనివర్సిటీ వరకు వెళ్లాయి. అనంతరం నారావారి పల్లె సమీపంలోని మోహన్బాబు ఫామ్ హౌస్ వద్ద కిడ్నాప్కు గురైన విద్యార్థి నేతలను పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనకు నిరసనగా విద్యార్థి సంఘాల నేతలు తిరుచానూరు పీఎస్ ముందు ధర్నా చేపట్టారు. కాలేజీలో జరుగుతున్న అక్రమాలను బయటపెడితే విద్యార్థి నేతలను కిడ్నాప్ చేస్తారా? ఇదేనా విద్యా సంస్థల విలువలు? అంటూ వారు యాజమాన్యాన్ని నిలదీశారు.
యూనివర్సిటీ నుంచి కౌంటర్ ఫిర్యాదు
ఇదిలా ఉండగా, యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని విద్యార్థి సంఘాల నేతలపై యూనివర్సిటీ పీఆర్వో సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాజమాన్యాన్ని డబ్బులు డిమాండ్ చేశారంటూ ఆరోపణలు చేశారు. ఈ మేరకు విద్యార్థి నేత అక్బర్ సహా మరికొందరిపై చంద్రగిరి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది.

