నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలకు పాలనను మరింత సులభతరం చేస్తోంది. ఇప్పటికే వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అనేక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు మరో ముందడుగు వేసింది. మున్సిపల్ శాఖకు సంబంధించిన 25 కీలక సేవలను పూర్తిగా ఆన్లైన్లోకి తీసుకొచ్చింది.
ప్రత్యేక పోర్టల్ లాంచ్
ప్రజలు మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంటి నుంచే సేవలు పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్ పోర్టల్ను ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా
- మ్యారేజ్ సర్టిఫికేట్
- ఆస్తి పన్ను చెల్లింపులు
- ట్రేడ్ లైసెన్స్
- మ్యూటేషన్ తదితర
మొత్తం 25 రకాల సేవలను ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం కల్పించింది.
సర్టిఫికేట్ల జారీకి టైమ్ ఫిక్స్
ఈ సేవలకు ప్రభుత్వం స్పష్టమైన గడువులు కూడా నిర్ణయించింది.
- మ్యారేజ్ సర్టిఫికేట్ – 3 రోజుల్లో
- ట్రేడ్ లైసెన్స్ – 7 రోజుల్లో
- ఇంటి పన్ను సేవలు – 15 రోజుల్లో
నిర్దేశిత గడువు దాటినా సేవలు జారీ కాకపోతే అధికారులు తప్పనిసరిగా కారణం వెల్లడించాలి. దరఖాస్తును తిరస్కరిస్తే కూడా రీజన్ చెప్పాల్సిందే. గడువులోగా దరఖాస్తులు పరిష్కరించకపోతే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పారదర్శకత, వేగమే లక్ష్యం:
దరఖాస్తులు, సర్టిఫికేట్ల జారీలో పూర్తి పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ఈ పోర్టల్ను రూపొందించారు. దీని వల్ల అవినీతి తగ్గడంతో పాటు, సేవల జారీ వేగం కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి..?
- cdma.ap.gov.in వెబ్సైట్ను ఓపెన్ చేయాలి
- ‘Fingertips’ విభాగంలోకి వెళ్లాలి
- ‘Online Services’ ఆప్షన్ను ఎంచుకోవాలి
- అవసరమైన సేవను సెలెక్ట్ చేయాలి
- నగరం లేదా పట్టణాన్ని ఎంపిక చేయాలి
- డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి దరఖాస్తు సమర్పించాలి
దరఖాస్తు మున్సిపల్ కమిషనర్ లాగిన్కు వెళ్లిన తర్వాత పరిశీలన పూర్తయ్యి సర్టిఫికేట్ జారీ అవుతుంది.
మొత్తానికి మున్సిపల్ సేవలను డిజిటల్ చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల ప్రజలకు సమయం, డబ్బు రెండూ ఆదా కానున్నాయి. త్వరలో మరిన్ని సేవలను కూడా ఆన్లైన్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.

