కోదాడ,ఫిబ్రవరి 4,నేటి తెలుగు పత్రిక: కోదాడ మున్సిపల్ ఎన్నికల బరిలో టీడీపీ నాయకులకు కాంగ్రెస్, బీఆరెస్ పార్టీల కండువాలు కప్పి, బీఫామ్ లిచ్చి అభ్యర్థులుగా నిలబెట్టటంతో టీడీపీకున్న బలాన్ని చెప్పకనే చెప్పినట్లు రుజువైందని తెలుగు రైతు సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ కోదాడ మున్సిపాలిటీ తాజా పాలకవర్గంలో టీడీపీ కౌన్సిలర్ ఐన సామినేని నరేష్ భార్య రజనికి 1వ వార్డు కాంగ్రెస్, కోదాడ పట్టణ అధ్యక్షులు ఉప్పుగండ్ల శ్రీనివాసరావుకు 18వ వార్డు కాంగ్రెస్, మాజీ ప్రధాన కార్యదర్శి పిడతల శ్రీనివాస్ భార్య శారదకు 28వ వార్డు బీఆరెస్, ఐటీడీపి రాష్ట్ర నాయకులు గోపిదేశీ వివేకానంద తల్లి లక్ష్మికు 14వ వార్డు బీఆరెస్ బీఫామ్ లిచ్చి ఎన్నికల బరిలోకి దింపారని తెలిపారు. రాబోయే పదేండ్లు మాదే అధికారం అంటున్న కాంగ్రెస్ కు, రాబోయేది మా ప్రభుత్వమే అంటున్న బీఆరెస్ కు సొంతంగా వార్డుల్లో నాయకులు లేక టీడీపీ నాయకులకు కండువాలు కప్పి పైగా ప్రగల్బాలు పలుకటం వారికే చెల్లుబాటు అవుతున్నదని హేళన చేసారు. వార్డు ఎన్నికలప్పుడే ఇన్ని కుతంత్రాలకు పాల్పడితే, రేపు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు ఎన్నికలప్పుడు ఎన్ని రకాలుగా ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తారో అని ఆందోళన వ్యక్తం చేసారు. అడ్డదారుల్లో అధికారం కోసం ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో తొక్కే రాజకీయ పార్టీలకు మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసారు.

