కోదాడ, ఫిబ్రవరి 13(నేటి తెలుగు పత్రిక ): కోదాడ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి ఫిరాయించి పదవుల కోసం వెంపర్లాడిన వారిని ఓడించిన ఓటరు మహాశయులకు తెలుగు రైతు సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలియజేశారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మాన్ని పాటించి, గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ బొల్లం మల్లయ్య యాదవ్ ను వదులుకొని సిట్టింగ్ సీట్ ను కాంగ్రెస్ కే వదిలిపెట్టిన ఘన చరిత్ర మా తెలుగుదేశం పార్టీది అని గుర్తుచేశారు. అలాంటిది ఒక్క వార్డు కౌన్సిలర్ దగ్గర కక్కుర్తిపడి టీడీపీ నుండి ఫిరాయింప జేసిన అభ్యర్థికి టికెట్ ఇచ్చి, రెట్టింపు నిధులిచ్చి, టీడీపీ జెండాలతో ఎమ్మెల్యే నాలుగు రోజులు, మంత్రి ఒకరోజు ప్రచారం చేసి కూడా గెలిపించు కోలేక పోయారని చెప్పారు.
టీడీపీలో వ్యక్తులు కాదు ముఖ్యం, పార్టీయే ప్రధానం అన్న మా కార్యకర్తల అభిమతం వల్లనే టీడీపీ నుండి ఫిరాయించిన అభ్యర్థులకు ఓటమి తప్పలేదని చెప్పారు.
