నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రైతులు ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. యాసంగి సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం ఈ నెల 17న రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించింది.ఇప్పటివరకు విడతల వారీగా నిధులు విడుదల చేస్తుండగా, ఈసారి ఒకే విడతలో మొత్తం నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రైతులు తమ ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ అవుతాయోనని ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆర్థికశాఖ కూడా అవసరమైన నిధులను విడుదల చేసింది.
రూ.9 వేల కోట్లు సిద్ధం
యాసంగి సీజన్ రైతు భరోసా కోసం ప్రభుత్వం సుమారు రూ.9 వేల కోట్లు ఖర్చు చేయనుంది. గత ఖరీఫ్ సీజన్లో 69,39,548 మంది రైతులకు సాయం అందించగా, దానికి రూ.8,744.13 కోట్లు వెచ్చించింది.ఈ సారి కూడా ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఆలస్యానికి కారణం?
జనవరిలోనే నిధులు విడుదల కావాల్సి ఉన్నా, పలు పరిపాలనా కారణాలు మరియు మున్సిపల్ ఎన్నికల వ్యస్తతల వల్ల ఆలస్యమైంది. ఎన్నికల నిర్వహణలో అధికారులు బిజీగా ఉండటంతో విడుదల వాయిదా పడింది. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో నిధుల జమకు ప్రభుత్వం సిద్ధమైంది.
రైతుల్లో హర్షం
నిధుల విడుదలలో జాప్యం జరగడంతో రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోగా, మరికొందరు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. ఇప్పుడు ఒకేసారి నిధులు జమ కానుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల మిర్యాలగూడలో జరిగిన సభలోనే సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలు పూర్తయ్యాక వెంటనే రైతు భరోసా విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ హామీని అమలు చేయనున్నారు.
