అమెరికాతో ఒప్పందంలో వ్యవసాయానికి మినహాయింపు అబద్ధం : ఎఐకెఎస్
గ్రామాల్లో ఆందోళనలకు పిలుపు.
న్యూఢిల్లీ: ఫిబ్రవరి17 (నేటి తెలుగు పత్రిక బ్యూరో చీఫ్): అమెరికాతో కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం నుంచి వ్యవసాయాన్ని మినహాయించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేసిన ప్రకటన అబద్ధమని ఆల్ ఇండియా కిసాన్ సభ (ఎఐకెఎస్) విమర్శించింది. ‘అమెరికా నుంచి భారత్ ముడి పత్తిని కొనుగోలు చేస్తుంది. ఈ పత్తితో తయారైన వస్త్ర ఉత్పత్తుల ఎగుమతులపై సున్నా శాతం పన్ను అమలవుతాయి’, ‘భారత్ – అమెరికా మధ్య మధ్యంతర ఒప్పందం అమల్లోకి వచ్చినప్పుడు బంగ్లాదేశ్ మాదిరిగానే భారత్కు కూడా రాయితీలు వర్తిసాయి’ అని మంత్రి డిక్లరేషన్లో చేసిన ప్రస్తావనలే ఆయన ప్రకటన అవాస్తవమని రుజువు చేస్తోందని ఒక ప్రకటనలో పేర్కొంది. పీయూష్ గోయల్ డిక్లరేషన్ పూర్తిగా రైతు వ్యతిరేకమైనది, దారుణమైనదని ఎఐకెఎస్ విమర్శించింది. అమెరికా నుంచి పత్తిని దిగుమతి చేసుకోవడం వల్ల ఇప్పటికే తక్కువగా ఉన్న దేశీయ పత్తి రేటు మరింతగా తగ్గుతుందని, మరింత సంక్షోభంలోకి వెళుతుందని, పత్తి వ్యవసాయం ఇబ్బందుల్లోకి వెళుతుందని, రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయని ఎఐకెఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. అత్యంత అధునిక యాంత్రిక పద్దతుల్లో సాగు చేసే, ప్రభుత్వ ప్రోత్సాహం కలిగిన అమెరికా పత్తి రైతులకు అనుకూలంగానే పియూష్ గోయల్ డిక్లరేషన్ ఉందని విమర్శించింది. దేశీయ పారిశ్రామిక వేత్తలను కూడా అమెరికా పత్తి దిగుమతి చేసుకునేలా డిక్లరేషన్ ప్రొత్సహిస్తుందని తెలిపింది.
దేశీయ పత్తి రైతులు సాగు వ్యయం పెరగడం, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారని తెలిపింది. అమెరికా పత్తి దిగుమతులతో దేశీయ రైతుల ప్రయోజనాలు దెబ్బతినవని, దేశీయ పత్తి వినియోగంపై ప్రభావం చూపదనే వాదనలను ఎఐకెఎస్ ఖండించింది. ఏసియన్ – భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంతో కేరళలోని రబ్బరు రైతులు తీవ్రంగా నష్టపోయినట్లే.. అమెరికా ఒప్పందంతో పత్తి రైతులు ఇబ్బందులు పడతారని, సాగును పూర్తిగా వదిలి వేయాల్సి వస్తోందని ఎఐకెఎస్ హెచ్చరించింది. గతేడాది సెప్టెంబరు 30 నుంచి డిసెంబరు 31 వరకూ పత్తి దిగుమతిపై సుంకాలను కేంద్రం సున్నాకి తగ్గించిందని, ఈ సమయంలో అమెరికా దిగుమతులు 95 శాతం పెరిగాయని ఎఐకెఎస్ గుర్తుచేసింది. పత్తి దిగుమతులు పెరిగితే భారత రైతులు అమెరికా, ఆస్ట్రేలియా, చైనా వంటి దేశాల రైతులతో పోటీ పడలేరని తెలిపింది. ఇప్పటికే దేశంలో కొనసాగుతున్న వ్యవసాయ సంక్షోభం కారణంగా రైతుల ఆత్మహత్మలు పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావించింది. దేశీయ రైతులను మోసం చేస్తున్న పియూష్ గోయల్ తక్షణమే రాజీనామా చేయాలని ఎఐకెఎస్ డిమాండ్ చేసింది. పత్తి పండించే గ్రామాల్లో ఉధృతంగా ప్రచారం చేయడం, పీయూష్ గోయల్ ద్రోహానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని ఎఐకెఎస్ ఆల్ ఇండియా సహాయ కార్యదర్శి సాగర్ విజ్ఞప్తి చేశారు.
