గన్నవరం/కంకిపాడు,ఫిబ్రవరి 27(నేటి తెలుగు పత్రిక): గ్రామాల లో మౌలిక వసతులు కల్పనకు ప్రధాన ఆదాయ వనరులైన ఇంటి పన్ను బకాయిలను నూరు శాతం వసూళ్లపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కృష్ణాజిల్లా పంచాయతీ అధికారిని డాక్టర్ జే అరుణ ఆదేశించారు. ప్రజల నుంచి పంచాయతీలకు రావలసిన పన్నుబకాయల వసూళ్లలో వెనకంజలో ఉన్న పలు మండలాలను ఆమె శుక్రవారం సుడిగాలి పర్యటన చేసే సంబంధిత అధికారులను అప్రమత్తల్ని చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులతో ఆమె సమీక్ష నిర్వహించారు. గన్నవరం పెనమలూరు నియోజకవర్గాల్లోని పంచాయతీ అధికారులు తో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మొండి బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇంటి పన్ను పరిశ్రమల టాక్సులు చెల్లించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. పలు పరిశ్రమల యజమానులతో స్వయంగా ఆమె మాట్లాడి బకాయిలను తక్షణమే చెల్లించాలని సూచించారు. 2025- 26 ఆర్థిక సంవత్సరం మరో నెల రోజుల్లో ముగియనున్నందున బకాయిల విషయంలో ఏ అధికారి క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం వహించిన సహించేది లేదని అరుణ హెచ్చరించారు. పన్నుల వసూలులో కృష్ణాజిల్లా ప్రథమ స్థానంలో నిలిచేందుకు క్షేత్రస్థాయిలో అధికారులందరూ చిత్తశుద్ధితో సేవలందించాలని కోరారు. కార్యక్రమంలో ఉయ్యూరు డివిజనల్ అధికారి పి రాజేష్, గుడివాడ డి ఎల్ పి ఓ పి సంపత్ కుమారి, ఎంపీడీవో తుంగల స్వర్ణలత, కంకిపాడు డిప్యూటీ ఎంపీడీవో కిరణ్మయి, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
