మార్చి 14(నేటి తెలుగు పత్రిక): భారత క్రికెట్కు విశేష సేవలు అందించిన ముగ్గురు దిగ్గజాలకు అరుదైన గౌరవం దక్కింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2024–25 సీజన్కు గాను ప్రతిష్టాత్మక లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులను భారత క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, రోజర్ బిన్నీ మరియు మహిళా క్రికెట్ లెజెండ్ మిథాలీ రాజ్ లకు అందజేయనుంది. మార్చి 15న న్యూఢిల్లీ లో జరిగే నమన్ (NAMAN) అవార్డుల వేడుకలో ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. పురుషుల విభాగంలో రాహుల్ ద్రవిడ్, రోజర్ బిన్నీలకు ప్రతిష్టాత్మకమైన ‘కల్నల్ సి.కె. నాయుడు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ ఇవ్వనుండగా, మహిళల విభాగంలో మిథాలీ రాజ్ కు లైఫ్టైమ్ అచీవ్మెంట్ ఫర్ ఉమెన్ అవార్డు అందించనున్నారు. ఈ గౌరవంతో పాటు ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు బహుమతి కూడా ఇవ్వనున్నారు.రోజర్ బిన్నీ పేరు వినగానే 1983లో భారత్ గెలిచిన చారిత్రాత్మక ప్రపంచకప్ గుర్తుకొస్తుంది. ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం కోచ్గా, సెలక్టర్గా కూడా సేవలందించారు. 2022 నుంచి 2025 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసి భారత క్రికెట్ అభివృద్ధికి కృషి చేశారు.
ఇక రాహుల్ ద్రవిడ్ అంతర్జాతీయ క్రికెట్లో 24 వేలకుపైగా పరుగులు సాధించి భారత జట్టుకు దశాబ్ద కాలం పాటు వెన్నెముకలా నిలిచారు. ఆటగాడిగానే కాకుండా కోచ్గా కూడా అద్భుత విజయాలు సాధించారు. ఆయన మార్గదర్శకత్వంలో భారత్ 2018 అండర్-19 ప్రపంచకప్ గెలిచింది. అలాగే 2024 టీ20 ప్రపంచకప్ విజయంలో కూడా కీలక పాత్ర పోషించారు.మహిళా క్రికెట్లో అత్యంత గొప్ప ఆటగాళ్లలో ఒకరైన మిథాలీ రాజ్ రెండు దశాబ్దాల పాటు భారత జట్టుకు సేవలందించారు. వన్డేల్లో 7805 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. భారత మహిళా జట్టును రెండు సార్లు ప్రపంచకప్ ఫైనల్కు చేర్చిన ఘనత కూడా ఆమెదే. మహిళా క్రికెట్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం లభిస్తోంది.ఈ నమన్ అవార్డుల వేడుకలో గత సీజన్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన యువ ఆటగాళ్లకు కూడా ప్రత్యేక అవార్డులు అందజేయనున్నారు.
