మార్చి 14(నేటి తెలుగు పత్రిక): భారత క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల వేడుకకు రంగం సిద్ధమైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహించే నమన్ (NAMAN) అవార్డ్స్ 2026 వేడుకలు మార్చి 15న న్యూఢిల్లీ లో అట్టహాసంగా జరగనున్నాయి. ఈ వేడుకల్లో గత ఏడాది అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లు, కోచ్లు, అంపైర్లను సత్కరించనున్నారు. ఇప్పటికే విజేతల జాబితా ఖరారు కావడంతో క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది.ఈసారి పురుషుల విభాగంలో టీమిండియా స్టార్ బ్యాటర్ శుభమాన్ గిల్ కు అత్యున్నతమైన పాలీ ఉమ్రీగర్ అవార్డు దక్కనుంది. ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా గిల్ ఈ అవార్డును వరుసగా రెండోసారి అందుకోబోతున్నారు. మహిళల విభాగంలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డును గెలుచుకుంది. ఆమె కెరీర్లో ఈ గౌరవం దక్కడం ఇది ఐదోసారి కావడం విశేషం.
దేశవాళీ క్రికెట్లో రాణించిన వారికి కూడా బీసీసీఐ పెద్దపీట వేసింది. ముంబైకి చెందిన ఈరా జాదవ్ ఉత్తమ మహిళా క్రికెటర్గా జగ్మోహన్ దాల్మియా ట్రోఫీని అందుకోనుండగా, హర్యానాకు చెందిన స్టార్ ఆటగాళి షఫాలీ వర్మ సీనియర్ వన్డేల్లో అద్భుత ప్రదర్శనకు గాను ఇదే ట్రోఫీని సొంతం చేసుకుంది.అలాగే ముంబై యువ ఆటగాడు ఆయుష్ మాత్రే, విదర్భకు చెందిన హర్ష దూబే లు లాలా అమర్నాథ్ అవార్డులను గెలుచుకున్నారు. ఇక దేశవాళీ క్రికెట్లో నాలుగు ట్రోఫీలు గెలిచి అగ్రస్థానంలో నిలిచిన ముంబై క్రికెట్ అసోసియేషన్ కు బెస్ట్ పెర్ఫార్మింగ్ అసోసియేషన్ అవార్డు దక్కనుంది.ఈ వేడుకల్లో గతంలో ఐసీసీ ట్రోఫీలు గెలిచిన భారత జట్లను కూడా ప్రత్యేకంగా సత్కరించనున్నారు. దీంతో ఈసారి నమన్ అవార్డ్స్ వేడుక క్రికెట్ అభిమానులకు నిజమైన పండుగలా మారనుంది.
