మార్చి 15(నేటి తెలుగు పత్రిక): టీ20 ప్రపంచకప్ విజయానంతరం భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాళ్లు సంజు సామ్సన్, అభిషేక్ శర్మ ఒకే వేదికపై సందడి చేశారు. ఈ సందర్భంగా అభిషేక్కు వస్తున్న క్రేజ్పై సంజూ శాంసన్ సరదాగా స్పందిస్తూ “త్వరగా పెళ్లి చేసుకో బ్రో” అంటూ జోక్ చేయడం అభిమానులను అలరించింది.ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ అనుభవాలు, సరదా సంఘటనలను పంచుకున్నారు. ఎక్కడికి వెళ్లినా అభిమానులు “అభిషేక్.. అభిషేక్” అంటూ గోల చేస్తున్నారని, అది చూసి జట్టులోని మిగతా ఆటగాళ్లకు కూడా కొంచెం అసూయగా అనిపించేదని సంజూ నవ్వుతూ చెప్పాడు. ఈ క్రేజ్ ఇలాగే కొనసాగితే మిగతా వాళ్లకు లైమ్లైట్ దక్కదని, అందుకే త్వరగా పెళ్లి చేసుకుంటే క్రేజ్ కొంచెం తగ్గుతుందేమోనని సరదాగా కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ టోర్నమెంట్లో సంజు సామ్సన్ అద్భుతంగా రాణించాడు. ఐదు ఇన్నింగ్స్ల్లో 321 పరుగులు చేసి జట్టుకు కీలక విజయాలను అందించాడు. ఫైనల్ మ్యాచ్లో 89 పరుగులతో చెలరేగి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు. మరోవైపు టీ20 ర్యాంకింగ్స్లో నంబర్-1 బ్యాటర్గా ఉన్న అభిషేక్ శర్మ టోర్నీ ప్రారంభంలో కాస్త తడబడ్డాడు. అయితే ఫైనల్లో కేవలం 21 బంతుల్లో 52 పరుగులు చేసి జట్టుకు అద్భుతమైన ఆరంభం ఇచ్చాడు.తన విజయానికి కారణం భారత మాజీ దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ అని అభిషేక్ శర్మ తెలిపాడు. గత రెండేళ్లుగా యువరాజ్ సూచించిన విధానాలను పాటిస్తున్నానని, ఫలితాల గురించి కాకుండా జట్టు విజయం కోసం ఆడాలని ఆయన నేర్పించారని చెప్పాడు.భవిష్యత్తులో టీ20లతో పాటు మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం తన లక్ష్యమని అభిషేక్ శర్మ వెల్లడించాడు. ప్రపంచకప్ విజయం తర్వాత ఈ ఇద్దరు యువ ఆటగాళ్ల కెరీర్ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.
