మార్చి 15(నేటి తెలుగు పత్రిక): టీ20 ప్రపంచకప్ 2026 ముందు నెలకొన్న బహిష్కరణ వివాదంపై జై షా ఘాటుగా స్పందించారు. క్రికెట్ ప్రపంచంలో ఏ జట్టు అయినా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కంటే పెద్దది కాదని స్పష్టం చేస్తూ పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.ముంబైలో జరిగిన ఇండియన్ బిజినెస్ లీడర్ అవార్డ్స్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. నిబంధనలు అందరికీ సమానమని, ఒక్క జట్టు కోసం సంస్థ తన నిర్ణయాలను మార్చదని కుండబద్దలు కొట్టారు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీని అడ్డుకోవాలని ప్రయత్నించడం సరైంది కాదని ఆయన వ్యాఖ్యానించారు.
అసలు వివాదం ఏమిటంటే
ఈ ఏడాది భారత్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్కు రావడానికి బంగ్లాదేశ్ జట్టు భద్రతా కారణాలు చూపుతూ నిరాకరించింది. దీంతో ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుని ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ ను టోర్నీలోకి చేర్చింది.అదే సమయంలో బంగ్లాదేశ్కు మద్దతుగా పాకిస్తాన్ కూడా భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తామని హెచ్చరించింది. అయితే చివరి నిమిషంలో ఐసీసీ ఒత్తిడితో పాక్ వెనక్కి తగ్గి టోర్నీలో పాల్గొంది.
వ్యూయర్షిప్లో రికార్డులు
టోర్నీ విజయవంతంగా ముగిసిందని జై షా తెలిపారు. ఒక దశలో ఏకంగా 7.2 మిలియన్ లైవ్ వ్యూయర్స్ మ్యాచ్లను వీక్షించారని, ఇది క్రికెట్ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందన్నారు. చిన్న జట్లు అయిన యునైటెడ్ స్టేట్స్, నెదర్లాండ్స్, జింబాబ్వే, నేపాల్ కూడా బలమైన జట్లకు గట్టి పోటీ ఇచ్చాయని ప్రశంసించారు.
టీమిండియాకు సందేశం
ప్రపంచకప్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ లకు కూడా జై షా కీలక సూచనలు చేశారు. శిఖరాగ్రం నుంచి కిందకు పడిపోవడం సులభమని, కానీ అట్టడుగు నుంచి పైకి రావడానికి సంవత్సరాలు పడుతాయని చెప్పారు. భవిష్యత్తులో 2028 Summer Olympicsతో పాటు 2030, 2031, 2036 వరకూ భారత క్రికెట్ను బలోపేతం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
